Latest News

జావీద్ మీర్జా, జార్జిరెడ్డి మిత్రుడు | George Reddy Real Life Story

loading...
నేను ఆ సంవత్సరమే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. అది 1971, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో అనుకుంటా...... నేను క్యాంపు కొత్త. ఆర్ట్స్ కాలేజీ బస్టాపుకు పోయాను. అప్పుడు రాత్రి ఎనిమిదవు తందనుకుంటా. ముగ్గురు విద్యార్థులు సిటీకి పోవడానికి బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. రాజకీయాల మీద. . . . జాతీయ రాజకీయాల మీద జోరుగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాలంటే నాకూ ఆసక్తే. వాళ్ళ మాటల్లోకి నేను దూరిపోయాను. నేనూ రెండు మాటలు మాట్లాడా. మాటల మధ్యలో వారెవరో తెలిసింది. వారిలో ఒకరు కులకర్ణి. సైన్సు కాలేజీలో పి.జి. చదువుతున్నాడు. మరొకరు జార్జిరెడ్డి... .. . ఎమ్మెస్సీ ఫైనల్.. మూడో వ్యక్తి ఎవరో గుర్తుకు రావడం లేదు. అదిగో . . . . . జార్జితో అలా మొదలైంది నా పరిచయం.

జార్జి మాటల్లో తీవ్రత ఉంది. నిజాయితీ ఉంది. స్పష్టత ఉంది. అంతే....ఆ క్షణమే నేను జార్జికి అభిమానిని అయి పోయాను. మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కాలంతోపాటు అది పెరిగింది. అప్పటి వరకూ నన్ను అంతగా ఆకర్షించిన వ్యక్తి ఎవరూ లేరు. లేదా అంతటి గౌరవాన్ని పొందగలిగిన ఆలోచనా తీవ్రత ఉంటుందని అనుకోలే. ఇదిగో. . . . అలాంటి వాడు. . . . . ఇప్పుడు నాకు సన్నిహితుడై పోయిన వ్యక్తి ఉన్నాడు. ఒక్క రంగం కాదు పలు రంగాలలో నిష్ణాతుడైన వ్యక్తి. చదువులో, నైతిక వర్తనలో, ఆలోచనా స్పష్టతలో ఉన్నత భావం. . . .. మార్పు కోసం చేసే పనిలో అత్యున్నత అంకితభావం. ఇవన్నీ కలబోస్తే జార్జి. కేవలం ఐదున్నర అడుగుల ఎత్తే. అయితేనేం మంచి శరీర దారుఢ్యం గలవాడు. జార్జి బాక్సర్. చెదరని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే ముఖం. . . శత్రువుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎప్పుడూ ముందుపీఠాన్నే ఉండేవాడు. .

నేను జార్జి బృందంలో చేరాను. మా గ్రూపు స్టడీ సర్కిళ్ళు నడిపేది. అక్కడ సామాజిక మార్పుకు సంబంధించిన అంశాలను చర్చించేవాళ్ళం. పరిపాలనలో ఇంత అవినీతి ఎందుకుంది? భారతదేశంలో విప్లవ సాధ్యాసాధ్యాలేమిటి? భారత విప్లవం ఏ మార్గం తీసుకుంటుంది? చే గువేరా చేసిన త్యాగం, సాహసం మనం చేయగలమా? ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు. . .. .. .ఇలా . . . . . ఎన్నో విషయాలు మా చర్చనీయాంశాలు.

జార్జి పుస్తకాల పురుగు. గంటలు గంటలు యూనివర్సిటీ లైబ్రరీలో గడిపేవాడు. జార్జి చనిపోయిన తర్వాత, జరిగిన ఒక స్మారక సభలో ఒక మిత్రుడు మాట్లాడింది నాకింకా జ్ఞాపకం వుంది. . . లైబ్రరీ బిల్డింగుకు దిగగొట్టిన మేకులు ఎలా ఉంటాయో జార్జి అంతగా లైబ్రరీకి అతుక్కుపోయి ఉండేవాడని ఆ మిత్రుడు మాట్లాడాడు. ఆ మాట నిజమే. అంత ఆబగా చదివేవాడు. రోజూ జిమ్ లో కొన్ని గంటలు గడిపేవాడు. అనేక గంటల లైబ్రరీలో గడిపేవాడు. నిద్రకు కేటాయించిన టైము తప్ప ఇక మిగిలినదంతా చర్చలకే. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఎమ్మెస్సీ పూర్తయ్యాక ఒక కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేయడం మొదలెట్టాడు. ఎక్కువగా నడిచే పోతుండేవాడు. జార్జికి నడక బాగా ఇష్టం. హవాయి చెప్పులంటే మోజు. నేనూ ఇంకా ఇతర దోస్తులమూ కూడా జార్జిని చూసి హవాయి చెప్పులనే వాడేవాళ్ళం. ఎప్పుడూ నడవడమూ. . . .మాట్లాడ్డమూను. మేమిద్దరమూ ఓసారి చేతులతో మల్ల యుద్ధానికి దిగాం. నా చేయిని కిందకి వంచాలని జార్జి, జార్జి చేతిని కిందకు వంచాలని నేనూ శక్తినంతా వుపయోగిస్తున్నాం. ఉహూ. . . .ఎంతకీ ఫలితం తేలదే. . . అప్పుడు జార్జి అన్నాడు. .పద నడుస్తూ రెజ్లింగ్ చేద్దామని. ఆ రోజుకు అలా ముగిసింది మా పోటీ. .

సైన్సు కాలేజీలో ఎలక్షన్లు. ప్రగతిశీల శక్తులకీ, ఎబివిపీకి మధ్యనే పోటీ. అప్పుడు కాంగ్రెసు పార్టీలో యువ ప్రగతిశీల శక్తుల గుంపు ఒకటి ఉండేది. దాన్లోనే జార్జి, అతని తమ్ముడు సిరిల్ వుండేవారు. ఒకసారి యూత్ కాంగ్రెస్ మీటింగ్ కి వాళ్ళతో కలిసి నేను కూడా ఢిల్లీ వెళ్ళాను. రఘనాధరెడ్డి అని కేంద్ర మంత్రి వుండేవారు. ఆ గ్రూపుకు ఆయనే నాయకుడు. జార్జి, సిరి లతో అతను సన్నిహితంగా ఉండేవాడు. రఘనాధరెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి కూడా జారికి మంచి మద్దతుదారే. శ్రీనాథ్ రెడ్డి ఢిల్లీలో గల ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ లో గుండె వ్యాధుల నిపుణుడు. జార్జి మరణం తర్వాత జార్జి సోదరుడైన సిరిల్‌రెడ్డి, జార్జి మిత్రులమూ ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు దానికి పి.డి.యస్.యు. అని పేరు ఖరారు చేశాం.

విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఎ.బి.వి.పి. పోటీ పడుతుండేది. సూర్దాస్, నర్సింహారెడ్డిలు మాకు ప్రముఖ ప్రత్యర్థులు. సిటీ నుంచీ గూండాలను తెచ్చుకునే వాళ్ళు తమకు మద్దతుగా. వాళ్ళు కులకర్ణిని విపరీతంగా కొట్టారు. అతని చెయ్యి విరగొట్టారు. వాళ్ళ ప్రధాన టార్గెట్ మాత్రం జార్జ్. ఒక రోజు జార్జిని కలవడానికి వెళ్ళా. ఒంటిమీద చొక్కాలేకుండా కన్పించాడు. ఒళ్ళు చూడగానే షాకయ్యా.. . . వీపుమీద, ఛాతీ మీద ఎక్కడ చూసినా కత్తిపోటు గాయాలే. గూండాలు ముందుగా తమ టార్గెట్స్ ని భయవిహ్వలులను చేస్తారు. మానసికంగా కుంగిపోయేలా చేస్తారు. గూండాగాళ్ళు కల్పించే భయవిహ్వలతకు మిత్రులు గురికాకుండా ఉండాలంటే నాయకుడు ఎప్పుడూ అగ్రభాగాన ఉండాలనేది జార్జి తర్కం. గూండాలు కిరాయికి వస్తారు. పోరులో వాళ్ళు గట్టిగా నిలబడలేరు. బలంగా ప్రతిఘటించామనుకో తోక ముడుస్తారు. . .. ఇది జార్జి ఆలోచన. జార్జి యోధుడు. సిరిల్ కూడా ఫైటరే. మా కాలేజీ వాడైన యాదగిరి జార్జికి బలమైన మద్దతుదారు. ఫైటింగ్ కి కూడా రెడీ! ఇనుప చువ్వలతో దాడులూ, ప్రతి దాడులూ జరిగేవి. ఇరుపక్షాలకూ దెబ్బలు తగిలేవి. జార్జికీ గాయాలయ్యాయి.

1971లో ఒకసారి జార్జితో కలిసి బొంబాయి పోయే అవకాశం దొరికింది నాకు. ఎంత సంతోషమైందో. జార్జిది న్యూక్లియర్ ఫిజిక్సు. టాటా మౌలిక పరిశోధనా సంస్థ నుంచి, భాబా అణు పరిశోధనా సంస్థ నుంచి జార్జికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నేనూ తనతో వస్తానన్నాను. రైట్ అన్నాడు. నా దగ్గర దమ్మిడీ లేదు. నేను మెరిట్ స్కాలర్షిప్పు మీద లాగిస్తున్నా. జార్జె ఐడియా ఇచ్చాడు. టాటా వాళు తనకు ఫక్లాస్ టికెట్‌కు అయ్యే ఖర్చును ఇస్తారు. ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తే ఒక్కరికి అయ్యే ఖర్చుతో ఇద్దరు వెళ్ళొచ్చన్నాడు. టికెట్ ఖర్చు సరే. చేతి ఖర్చులకు? క్యాంటీన్ ఓనరు దయా సేను అప్పు అడిగితే వంద రూపాయలిచ్చాడు. వారికి బొంబాయిలో ఒక మళయాళీ స్నేహితుడున్నాడు. మేం అక్కడికే వెళ్ళాం. అదొక ఇరుకు గది. ఆ మళయాళీ మిత్రుడు మా కోసం అని నైట్ షిఫ్టులో ఉ ద్యోగానికి పోయేవాడు. ఆయన మంచం మీద మేం పడుకునేవాళ్ళం. ఒకటి రెండు సార్లు రాత్రి షిప్టు కాక పగటి షిప్టు పడింది. ఇంకేం మేమిద్దరమూ మంచం కింద, మంచంపైన మళయాళీ మిత్రుడు. బొంబాయికి ట్రైయిలో పోతున్నప్పుడు జనరల్ కంపార్టుమెంటులో ఎలా పడుకోవాలో కూడా జార్జి నేర్పాడు. మా వద్ద పెద్దగా లగేజీ లేదు. మాకు దుప్పట్లూ లేవు. కింద శుభ్రం చేసుకోవడం, న్యూస్ పేపర్లు పరుచుకొని పడుకోవడం. అంతే. అప్పుడు ఉత్సాహమే అలా ఉండేది. విలాసాల సంగతి పక్కకు పెట్టండి. సౌకర్యాల గురించి కూడా పెద్దగా పట్టించుకునేవాడుకాదు. మేం వెళ్ళిందేమో వర్షాకాలం. దాదాపు ప్రతిరోజూ వాన పడేది. వానలోనే నడిచేవాళ్ళం. తడి బట్టలతోనే లోకల్ ట్రెయిన్లో ప్రయాణించే వాళ్ళం. అప్పుడప్పుడూ రెండో ఆట సినిమాకెళ్ళే వాళ్ళం. . అవునూ . . . . . చెప్పటం మరిచా. మాతోపాటు యాదగిరి కూడా వచ్చాడు. వారం పది రోజులున్నాం బొంబాయిలో. యాదగిరి మహా సరదా మనిషి. ఇన్నేళ్ళ తర్వాత జ్ఞాపకం తెచ్చుకుంటుంటే అన్పిస్తుంది. నా జీవితంలో అంత ఆహ్లాదకరమైన ట్రిప్పు మరోటి రాలేదేమిటి అని. ప్రయాణ సమయమంతా చర్చలే. జార్జి కొన్ని పుస్తకాలు కొన్నాడు. నాకు బాగా గుర్తుంది. . .

ది స్టూడెంట్ అప్ రైజింగ్ ఇన్ యూరప్ ( యూరప్ లో విద్యార్థి విజృంభణ) అనేది ఆయన కొన్న పుస్తకాల్లో ఉంది. ట్రాట్నీ రచనలు కూడా కొన్నాడు. ట్రాట్నీ రచనల్లో జార్జికి బాగా ఆసక్తి జనించింది. బాగా ఇష్టపడ్డాడు.

ఉస్మానియా ఇంజనీరింగు కాలేజీలో ఎన్నికల వేడి బాగా ఉంది. క్లాసు రిప్రజెంటేటివ్ గా నేను గెలిచాను. (నాకు పోటీ ఎవరూ లేరు లెండి) మా గ్రూపు నుంచి పెసిడెంటు అభ్వరి యాదగిరి. ప్రచారం బాగానే జరుగుతోంది. యాదగిరికి ప్రత్వరి లఖన్ సింగ్. అతనిది సిటీలోని ధూల్ పేట్. (ధూల్ పేట అంటే గూండాగిరీకీ, గుడుంబా, అక్రమ సారా తయారీకీ ప్రసిద్ది. అతనికి ఎబివిపి సపోర్టు. రాత్రుళ్ళలో హాస్టళ్ళలో చర్చలు జరుగుతుండేవి. ఇంజనీరింగ్ కాలేజీ వెనక ఉన్న హాస్టల్ (ఇ సి హెచ్ - 1) లో లఖన్ సింగ్ ధూల్ పేట గూండాలతో క్యాంపు పెట్టాడని హాస్టలు విద్యార్థులు మాకు చెప్పారు. ఎందుకోగానీ ఆ చర్చల్లో నేను లేను. అయితే పరిస్థితి మాత్రం బాగా ఉద్రిక్తంగా ఉంది. నేనప్పుడు కాలేజీలో ఉన్నా. ఎప్పటిలాగే దయా సేర్ క్యాంటీను బయట కూర్చుని న్నాం. జార్జి, సిరిలు కూడా మాతో ఉన్నారు. దామోదర్ కూడా ఉన్నాడు. రాంచందర్ రెడ్డి అనే అతను అదే హాస్టలులో ఉండేవాడు. అతను జాయింట్ సెక్రెటరీ పోస్టుకు అభ్యర్థి. లఖన్ గ్రూప్ అంటే భయపడిపోయాడు. మేం కూర్చున్న దగ్గరికి రాంచందర్ వచ్చాడు. లఖన్ అంటే భయమేస్తున్నదనీ, జార్జిని తనతో రమ్మనమని అన్నాడు. మరో ఆలోచన లేకుండా జార్జి లేచి నిలబడ్డాడు. వెస్పా వెనక సీటు మీద కూర్చుని వెళ్ళాడు. అదే చివరి చూపు అవుతుందని మేమెవ్వరమూ అనుకోలే. రాంచందర్ అడగ్గానే ఏ మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా, నిర్లక్ష్యంగా వెళ్ళడం తీవ్ర పర్యవసానాలకు దారితీసింది. హంతకులు జార్జి కోసమే వేచి చూస్తున్నారు. బహుశా రాంచందరను పంపడం ఒక ట్రాప్ అనుకుంటున్నా. దానికి జార్జి పడ్డాడు. హంతక ముఠా పొడవాటి కత్తులతో జార్జి మీద పడ్డారు. ఒళ్ళంతా కత్తి పోట్లే.

జార్జిని పొడిచారని ఎవరో పరిగెత్తుకుంటూ క్యాంటీన్ దగ్గరకొచ్చారు. అక్కడున్న వాళ్ళమంతా జార్జి వెళ్ళిన హాస్టల్ వైపు పరిగెత్తాం. నేల మీద పడి ఉన్నాడు జార్జి. కదలికలు లేవు. నెత్తురు ధారగా కారిపోతోంది. జార్జిని రెంతు చేతుల్లో ఎత్తుకున్నాను. కాలేజీ వైపు మోసుకెళుతూ ఉన్నా. ఇంతలో ఎవరో కారు తెచ్చారు. నేను కారు ఎక్కేలోపే జార్జిని కారులో ఆసుపత్రికి తీసుకుపోయారుఆసుపత్రికి చేరగానే జార్జి మరణించాడని నాకు చెప్పారు.

హతవిధీ! ఆ పరమాద్భుత వ్యక్తి ఇకలేడు. ఆ స్నేహశీలి, చురుకైన మేధావి, రుజువర్తనలో మచ్చలేనివాడు, మార్పుకోసం తపించిన వాడు, పరివర్తన తేవడానికి అంకితమైనవాడు. . . . .మా జార్జి . . . . మన జార్జి. . . . ఆ 1972 ఏప్రిల్ 14న వీరుడిలా మరణించాడు. పాతికేళ్ళప్రాయంవాడు. గొప్ప వారికి మరణం లేదంటారు. వారు చిరంజీవులు. జార్జి చిరంజీవి...... చిరంజీవి జార్జి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.