Latest News

తరతరాలకూ స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర

loading...

రాయలసీమ పౌరుషం ని తెల్ల దొరలకు రుచి చూపించిన మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఈ రోజు . ఆయన్ని స్మరించుకుంటూ ఈ పోస్ట్ వెయ్యడం జరిగినది.... అయన వర్ధంతి రోజు ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం......

సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబావుటా తరతరాలకూ స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర

ఆసేతు హిమాచలం తెల్లదొరల పాలనలో మగ్గుతున్న వేళ.. సీమ పౌరుషం భగ్గుమంది. భరతమాతను చెర విడిపించేందుకు ‘ఆరడుగుల’ సీమ సింహం జూలు విదిల్చింది. పదునైన ఖడ్గం చేతబట్టి శత్రువుల తలలను తెగనరికింది. రవి అస్తమించని సామ్రాజ్యపు వెన్నులో వణుకు పుట్టించింది. ఇది చరిత్ర అంతగా ఎరుగని తొలి స్వాతంత్య్ర సంగ్రామం.

బ్రిటీషువారి దాష్టీకాన్ని ప్రశ్నించి, వారిపై సాగిం చిన మడమ తిప్పని పోరాట పటిమను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి. కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) వారి కుటిల కుతంత్రాలపై కన్నెర్రజేసి కత్తిదూసి కదన రంగంలోకి దూకిన తొలితరం యోధుని రూపాన్ని ఆవి ష్కరిస్తాయి. వెయ్యి ఏనుగులనైనా నిలువరించే బ్రిటీషు సైన్యానికి... ఆ ఒక్కపేరు చెబితేనే సింహ స్వప్నం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబాటు చేసిన ఈ యోధుని పేరు చరిత్రలో అంతగా కనిపించదు. అయితేనేం.. రేనాటి సీమలో ఏ ఇంట అడిగినా ఆయన వీరత్వాన్ని వివరిస్తారు. రాలసీమ పౌరుష పతాకంపై చెరగని గుర్తు.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఉరికొయ్య ఎక్కేముందుకూడా తొడగొట్టి మీసం మెలేసి, పరాక్రమాన్ని వీలునామాగా రాసిపోవెళ్లిన ధీరుడు.

రేనాటి_చరిత్ర...

బ్రిటీషువారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతంలో ఇక్కడ బలమైన పాలకులు ఒకరు నిజాం నవాబు, మరొకరు మైసూర్‌ పాలకుడు హైదర్‌ ఆలి. హైదర్‌ ఆలిని ఓడిస్తే దక్షిణాన పాగా వేయవచ్చని బ్రిటీషువారు యుద్ధం చేశారు. హైదర్‌ ఆలి కుమారుడు టిప్పుసుల్తాన్‌ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమే శాడు. చివరికి మరాఠా పీష్వా, నిజాం నవాబు సహ కారంతో నాల్గవ మైసూర్‌ యుద్ధం (1799)లో టిప్పు సుల్తాన్‌ సైన్యాన్ని బ్రిటీష్‌వారు ఓడించారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురూ పంచుకున్నారు. కర్ణాటకలోని కొంతప్రాంతం మరాఠా పీష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటీష్‌ పాలన ఆరంభమైంది. నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో పాలెగాండ్లు స్థానిక పాలకులు. ఒక్క పాలెగాని కింద వంద నుంచి రెండు వందల గ్రామాలు ఉండేవి. ఈ వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. పాలెగాండ్లు వారి సామంతులు.

నొస్సం_పాలెగాండ్ల_చరిత్ర..

కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటీషువారిని ఎదురించి బంధీ అయ్యాడు. నొస్సం బ్రిటీషువారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పా టు చేశారు. జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపో వడంతో, అతని సోదరి కుమారుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డికి భరణం అందేది. ఆయన జన్మించింది రూప నగుడిలో. పెరిగింది ఉయ్యాలవాడలో. భరణం అందు కుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి కుటుం బాన్ని గౌరవభావంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు సుమా రు నలభై ఏళ్లు. ఆయనకు బ్రిటీషు వారి నుంచి నెలకు రూ.11 భరణం అందేది.

ఆత్మాభిమానానికి_ప్రతీక_నరసింహారెడ్డి

వంశానుసారంగా అందాల్సిన భరణం విషయంలో జరిగిన ఓ చిన్న సంఘటన నరసింహారెడ్డిలోని ఆత్మాభి మానాన్ని దెబ్బతీసింది. తన ప్రాంతంపై పెత్తనం చెలా యిస్తూ, దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటీషు వారిపట్ల ఆయ నకు అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారా స్థాయికి చేర్చింది. నాటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి నరసింహారెడ్డికి చెల్లించాల్సిన భరణం విషయంలో అవహేళనగా మాట్లాడి ఆయనలో కోపావేశాలు పెరిగేలా చేశాడు. నరసింహారెడ్డి పంపిన అనుచరుడితో ‘ముష్టి తీసుకునే వాడికి మరోక ముష్టివాడా..? అతను బ్రిటీషు వారి నుంచి భరణం తీసుకుంటూ బ్రిటీషు వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను.. ఇస్తా భరణం’ అని చెప్పి పంపడంతో నర సింహారెడ్డిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ‘ట్రెజరీనే కొల్లగొల్లడతాను. నీ ప్రాణాలు తీస్తాను. చేతనైతే రక్షించుకో..’ అంటూ లేఖరాసి పంపిం చాడు. దీంతో తహసీల్దారు అప్రమత్తమై, ట్రెజరీలోనే ఉండిపోయాడు.

రక్షణగా కొంత బ్రిటీషు సైన్యాన్ని ఏర్పా టు చేసుకున్నా... నరసింహారెడ్డి చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైర విహారం చేశాయి. ఎదురొచ్చిన మిలిటరీ సైన్యాన్ని మట్టుబెట్టి, తనను అవహేళనగా మాట్లాడిన తహసీల్దారు రాఘవాచారి శిరస్సు ఖండించాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్‌ ఎడ్వర్టుకి గుండుగీయించి, ‘నీ బ్రిటీషు అధికారు లకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనా లప్ప వద్ద కలుసుకోమను’ అని చెప్పి, ఎనిమిది వందల అయిదు రూపాయల పది అణాల నాలుగు పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటీషు సైన్యానికి సవాలు విసిరాడు.

నొస్సం_కోటపై_బ్రిటీషువారి_తొలిదాడి

తహసీల్దార్‌ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్‌ కాక్రేన్‌ ఆగ్ర హోదగ్రుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకొని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్లారిలోని బ్రిటీషు బ్రిగేడియర్‌ జనరల్‌ వాట్సన్‌ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు అవుకు రాజు నారాయణరాజు పరివారం, ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శుత్రుసైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించేవారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలురకం శతఘ్నులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23న బ్రిటీషు సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. గుండె లు జలధరింపజేసే పోరాటం.. బ్రిటీష్‌ సైన్యం చావుకేకల తో భీతావహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటీష్‌ సైన్యం మట్టికరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్‌ తలను ఒక్కవేటు తో నరికేశాడు నరసింహారెడ్డి.

అడుగడుగునా_యుద్ధ_తంత్రాలు

నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటీషువారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపో కూడదని, బ్రిటీషు సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహా రం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వన దుర్గంలో కి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చారు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్‌ అనే ఫారెస్ట్‌ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలా త్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకు డు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్‌ను వెంటాడి వేటాడి చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు, కంభం చుట్టు పక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నా యి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటీషు అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది.

నరసింహారెడ్డి_తలపై #రూ.10 #వేల_బహుమతి

కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటీషు ప్రభుత్వ తాలుకా కార్యాలయంలో కడప కలెక్టర్‌ కాక్రేన్‌ అధ్యక్షతన వాట్సన్‌ స్థానంలో నియమితుడైన కెప్టెన్‌ నార్టన్‌, కర్నూలు కెప్టెన్‌ రసెల్‌, మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ జోసఫ్‌, గవర్నర్‌ ఏజెంట్‌ డానియెల్‌ సమావేశ మయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాల ని, అతని తలపై రూ.10 వేలు బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించు కున్నారు. ఆ మర్నాడే బ్రిటీష్‌ అధికారులు ఒక ప్రకటన చేశారు. ‘రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం, ఆచూకి తెలిపిన వారికి రూ.5 వేలు బహుమానం, అతన్ని సజీ వంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చినవారికి రూ.10 వేలు బహుమానం కలెక్టర్‌ కాక్రెన్‌ దొరవారు ఇస్తారు. వీరులై న వారు నరసింహారెడ్డిని పట్టిచ్చి బహుమానం అందు కోండహో’’.. అంటూ తప్పెటతో చాటింపు వేయించారు.

నొస్సం కోటను కూల్చిన బ్రిటీష్‌ ప్రభుత్వం

ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టు బెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్‌ నార్టన్‌ నొస్పం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడు. ఇదే సంద ర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియజేయకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటీషు అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామపెద్ద రోశిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోశిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయ నను కోడిపందేలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వా నాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు.

సాటి పాలెగాళ్ల మద్దతు

అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగిర్దారు, వెంకట క్రిష్ణయ్య, అనంతపురం జమిందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగిర్దార్‌ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్‌ తదితరుల మద్ద తు సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. బ్రిటీష్‌ పాలకు లపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు సహకారం కావాలని కోరారు.

ఆచూకి చెప్పింది బంధువే..

ఉయ్యాలవాడ జాగీర్దార్‌ పెద్దమల్లారెడ్డి కుటుంబాని కి నెలకు రూ.70 భరణం బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సగం సోదరుడు చిన్న మల్లారెడ్డికి పోయేది. పెద్ద మల్లారెడ్డి ముగ్గురు కుమారుల్లో చివరి వాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకున్నాడు మల్లా రెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వీక్షిస్తుండగా కడప కలెక్టర్‌ కాక్రేన్‌ నుంచి అతనికి వర్తమానం అందింది. కాక్రేన్‌ పథకం పలించింది. కోటలో పాగా పడింది. అత ను అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకో వడానికి మార్గం సులువైంది. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బందించి కడప పట్టణంలోని లాల్‌ బంగ్లాలో పెట్టాడు. తన అనుమతిలేనిదే లోనికి ఎవ్వరినీ వెళ్లనీయ వద్దని బంగ్లా అధికారులను ఆదేశించారు. నరసింహారెడ్డి కి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్‌ ఇబ్ర హీం, కర్నూలు నవాబును బంది చేశాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొర సుబ్బయ్య ను విడిపించుకు నేందుకు వస్తాడని కాక్రెన్‌ ఎత్తుగడ వేశాడు. అయితే ఓ అర్ధరాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి నరసింహారెడ్డి తన భార్య, బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్‌ వంతైంది.

ప్రజలపై_హింస

నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవడం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటీష్‌ అధికారు లకు అర్థమైంది. ఏ ప్రజల కోసమైతే జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా నరసింహారెడ్డిని లొంగదీసు కోవచ్చని పన్నాగం పన్నారు. రెడ్డి ని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్లాజెల్లా.., గొడ్డూ గోదా.. ఎవరినీ వదల్లేదు. అనుమా నం ఉన్న ప్రతివారిని పటు ్టకుని ‘నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు’ అంటూ హింసించారు. కండకుష్టి గల యువకులను బంధీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నర సింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగిం ది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహా రెడ్డి ప్రజలకోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు.

అంతిమ_పోరాటం..

1856 అక్టోబర్‌ 6 చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైంది. నరసింహారెడ్డి ఆచూకిని కనుగొన్న బ్రిటీష్‌ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి, ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్‌ కాక్రేన్‌ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నార్టన్‌ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహా రెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ తరుణంలో నార్టన్‌ నరసింహారెడ్డి తుటాకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫిణీ సేన ఎక్కువగా ఉండటంతో పరిస్థితి చేజారింది. బ్రిటీష్‌వారు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తూటాలన్నీ అయిపోగా చివరికి కత్తి పట్టి సైనికు ల మధ్య చొరబడి సింహనాదం చేశాడు. బ్రిటీష్‌ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది.

కోవెలకుంట్ల_కోట_గుమ్మానికి_నరసింహారెడ్డి_తల

నరసింహారెడ్డిని విచారించిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసు లంతా తమ దొరను చివరిసారిగా చూసుకొనేందు కు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరి జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫిణీ సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగిపొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్లు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంత టితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రెటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు పదడుగుల దూరానా నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహా రెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుపసంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటీష్‌ వారు. 1877 వరకు మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడతీసారు.</div>

loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.